శ్రాద్ధ కర్మయొక్క ప్రాముఖ్యత

Article also available in :

“శ్రాద్ధం” అని చెప్పగానే నేటి వైజ్ఞానిక యుగంలోని యువతరం మనస్సులలో “అశాస్త్రీయ మరియు అవాస్తవిక కర్మకాండల ఆడంబరం “ అనే తప్పు కల్పన రూపొందుతుంది. దీనికి కారణం ధార్మిక శిక్షణ యొక్క లోటు, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడంలో అనాసక్తి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, హిందూ విరోధి సంఘటనల నుండి హిందూ ధర్మం యొక్క ఆచార వ్యవహారాల పైన నిలవకుండా జరుగుతున్న ద్వేషపూరిత విమర్శలు మొదలైనవి.  శ్రాద్ధకర్మ విషయంలో సమాజంలో చోటు చేసుకున్న ఆలోచనలు ఇలా ఉన్నాయి. పూజ, అర్చన, శ్రాద్ధ పక్షం మొదలైన వాటి పైన విశ్వాసం ఉంచకుండా, సమాజ హిత సేవలే సర్వశ్రేష్ఠమని చెప్పేవారు పితృలకు శ్రాద్ధ విధులను చెయ్యకుండా వాటికి బదులుగా “పేదలకు అన్నదానం చేస్తాము, లేదా పాఠశాలలకు సహాయం చేస్తాము” అని అంటారు ! ఎంతో మంది ఇలానే చేస్తారు కూడా ! ఇలా చెయ్యడం అంటే ఒక రోగికి శస్త్రచికిత్స చెయ్యకుండా దానికి బదులుగా మేము అన్నదానం చేస్తాము, పాఠశాలలకు సహాయ పడతాము” అని చెప్పినట్లవుతుంది. శ్రాద్ధ కర్మలలోని మంత్రోచ్చారణలలో పితృలకు సద్గతినిచ్చే సూక్ష్మశక్తి ఉంటుంది. దానివలన పితృలకు సద్గతి సాధ్యమవుతుంది. కాబట్టి పైన చెప్పిన ప్రతిపాదన హాస్యాస్పదమనిపిస్తుంది.

హిందూ ధర్మంలో చెప్పబడిన ఈశ్వర ప్రాప్తి యొక్క మూలభూత సిద్ధాంతాలలో “దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అలాగే సమాజ ఋణం తీర్చడం” అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. వీటిలో పితృఋణం తీర్చడానికి “శ్రాద్ధ కర్మ అవసరం. తలిదండ్రుల, ఇతర సంబంధీకుల మరణోత్తర ప్రయాణం సుఖకరంగా, క్లేశరహితంగా సాగడానికి, వారు సద్గతిని పొందడానికి చేయాల్సిన కర్మను శ్రాద్ధకర్మ అని అంటారు. శ్రాద్ధ కర్మలలోని మంత్రోచ్చారణలలో పితృలకు సద్గతినిచ్చే సూక్ష్మ శక్తి దాగుంది. శ్రాద్ధ కర్మలలో పితృలకు హవిర్భాగాన్నివ్వడం వలన వారు సంతుష్టులవుతారు. శ్రాద్ధకర్మ చెయ్యకపోతే పితృలు అతృప్తులుగా మిగిలిపోయి, అలాంటి వాసనాయుక్త పితృలద్వారా కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగవచ్చు. శ్రాద్ధకర్మ చెయ్యడం వలన పితృలు ఆ ఇబ్బందుల నుండి విడుదల పొందుతారు. అలాగే మన జీవితమూ సుఖమయంగా ఉంటుంది.

శ్రాద్ధ కర్మకు ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా నేడు హిందువులలో మనం చూస్తున్న ధార్మిక శిక్షణ కొరత, ఆధ్యాత్మ శాస్త్రం మీద ఉన్న అపనమ్మకం, పాశ్చాత్య సంస్కృతి యొక్క అంధానుకరణ లాంటి వాటి వలన శ్రాద్ధకర్మ ఉపేక్షణకు గురి అవుతోంది. శ్రాద్ధ కర్మ వాస్తవికతలేని, తగని కర్మగా పరిగణించ బడుతోంది. కాబట్టి శ్రాద్ధ సంస్కారం కూడా ఇతర సంస్కారాలంత ముఖ్యమైనదే అని చెప్పడం ఎంతైనా అవసరమనిపిస్తుంది.

శ్రాద్ధ కర్మ చెయ్యడం వలన పూర్వీకుల ఇబ్బందుల నుండి మనకు రక్షణ ఎలా కలుగుతుంది ?

శ్రాద్ధ కర్మల వలన ఏర్పడిన ఇంధనం (శక్తి) మృత వ్యక్తియొక్క లింగ దేహంలోని త్రిగుణాల ఇంధనంతో (శక్తి) సమానంగా ఉంటుంది. కాబట్టి శ్రాద్ధ కర్మ వలన ఏర్పడిన ఇంధనం లింగదేహానికి లభ్యమై, అది అతి తక్కువ వ్యవధిలో మర్త్యలోకాన్ని దాటుతుంది. (భూలోక భువర్లోకాల మధ్యలో మర్త్యలోకం ఉంటుంది). మర్త్యలోకాన్ని దాటిన లింగదేహం మళ్ళీ భూమి వాతావరణ కక్షలోకి వచ్చి భూమిపైనున్నవారికి ఇబ్బందులు కలిగించడానికి వీలుపడదు. కాబట్టి శ్రాద్ధ కర్మ చెయ్యడం అన్నది ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. లేకపోతే అనేక వాసనలకు లోనైన అనేక లింగదేహాలు సాధకులకు ఇబ్బందులు కలిగించి వారిని సాధన నుండి విముఖుల్ని చేయగలవు.
– ఒక విద్వాంసురాలు (సౌ. అంజలీ గాడ్గిల్ మాధ్యమం నుండి 01-03-2005, సాయంత్రం: 6.43)

శ్రాద్ధ కర్మల వలన కలిగే లాభములు

అ. శ్రాద్ధ కర్మలు చెయ్యడం వలన ఎలాంటి ఫల ప్రాప్తి కలుగుతుంది అనే విషయం గురించి గరుడ పురాణంలో ఒక శ్లోకం ఉంది.

ఆయుః పుత్రాన్ యశః స్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియమ్|

పశున్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్ ||

–      గరుడపురాణం. అంశం 2, అధ్యాయం 10, శ్లోకం 57.

అర్థం : పితృపూజ అనగా శ్రాద్ధ కర్మలవలన ఆయువు, పుత్ర సంతానం, కీర్తి, స్వర్గప్రాప్తి, పుష్టి, బలం, శుభం, పశుసంపద, సౌఖ్యం, ధనం, ధాన్యం లభిస్తాయి.

ఆ. గ్రహణకాలంలో శ్రాద్ధ కర్మ చెయ్యడం వలన శ్రాద్ధ కర్మ చేసినవాడికి భూదాన ఫలం లభిస్తుంది.

(ఆధారం: సనాతన సంస్థ ప్రచురించిన గ్రంథం – “శ్రాద్ధ కర్మ” – 2 భాగాలు )

Leave a Comment